21, ఫిబ్రవరి 2024, బుధవారం

అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య ... ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్  జ్ఞాపకాలు 108

అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య   ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్  జ్ఞాపకాలు 108 ---------------------------------------కొన్ని దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ ల మధ్య చర్చలో  అయోధ్య - బాబ్రీ మసీదు , కాశ్మీర్ , తెలంగాణ ఈ మూడు ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యలు అనే అభిప్రాయం  వినిపించేది .   అసలు పరిష్కారమే లేదు  అనుకొన్న ఈ మూడు సమస్యలకు కూడా మన కళ్ళ ముందే పరిష్కారం లభించింది . కానీ  మహానగరంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం సమస్య మాత్రం ఈ మూడు సమస్యలకన్నా జటిలంగా మారింది . ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనే ఓ కల బలంగా ఉంటుంది .  హౌసింగ్  సొసైటీ లో తనకూ ఓ ప్లాట్ దక్కాలి అని జర్నలిస్ట్ గా అక్షరాబ్యాసం చేసినప్పుడే జర్నలిస్ట్ మనసులో బలంగా ఉంటుంది .  *********1987 సెప్టెంబర్ నెలలో ఆంధ్రభూమి కార్యాలయంలో అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోని నిలబడ్డాను . హైదరాబాద్ వీడి వెళుతున్నానని బాధ . ఉద్యోగం వచ్చింది అని సంతోషం .  అప్పుడు ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ గా ఉన్న  రాధాకృష్ణ ఒకే జిల్లా కాదు , కులం కాదు ... నా రాతలంటే బోలెడు అభిమానం . ఎలాగైనా జీవితంలో బాగుపడేట్టు చేయాలి అనుకోని లెటర్ ఇస్తూ" మెదక్ జిల్లా రిపోర్టర్ గా వెళ్ళు ..  అక్కడ జర్నలిస్ట్ ల హౌసింగ్  సొసైటీ ఉంటుంది . వెళ్ళగానే ముందు ఆ సొసైటీ లో సభ్యత్వం తీసుకో ..... నేను విశాఖలో ఉండగా  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయి రెండు రోజుల్లో ఇస్తారు  అనగా నేను కలెక్టర్ మీద ఓ వార్త రాశాను . దానితో కలెక్టర్ కు మండింది . అన్నీ రద్దు చేశాడు . అందరూ దెబ్బ తిన్నారు" అంటూ తన విషాద భరిత ఇంటి స్థలం కథ చెప్పుకొచ్చారు . తనదే కాదు  ఇది చాలా మంది  అంతులేని కథ అని ఆ రోజు రాధాకృష్ణ ఉహించి ఉండరు . మెదక్ జిల్లా రిపోర్టర్ గా సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రభ నుంచి వారానికి ఓ రిపోర్టర్ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి  వచ్చేవారు .1988-89 లో  ఓ వారం  అంజయ్య  వచ్చినప్పుడు హైదరాబాద్ లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకో అని సలహా ఇస్తే ... నేను పని చేసేది మెదక్ జిల్లాలో హైదరాబాద్ లో ఎలా తీసుకుంటా అని ప్రశ్నించా ... నీకెందుకు  నేను చెబుతున్నాను కదా ? అని చెప్పినా వినలేదు . ఓ దశాబ్ద కాలం గడిచాక 95లో  ప్రెస్ క్లబ్ లో మద్య నిషేధం తక్షణం ఎత్తివేయాలి అంటూ అప్పటి సీఎం బాబు సమక్షంలో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం . బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మించగలరు . అయన కోసం మనం డిమాండ్ చేయడం ఏమిటీ అని ఆవేశంగా మాట్లాడి కిందకు వచ్చాక ... ప్రెస్ క్లబ్ తో పాటు , హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు చూసే ఉద్యోగి ఒకరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకొని , మీకు హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం ఉందా ? అని అడిగితే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు కదా ? అని బదులిచ్చాను . ఇదిగో ఫారం నింపి ఇవ్వండి అని అక్కడి కక్కడే సొరుగు  నుంచి ఫారం తీసి ఇచ్చాడు . అలా 95లో సభ్యత్వం . గోపన్ పల్లిలో సందడిగా సభ్యుల సమావేశం ప్లాట్ ల కేటాయింపు కుటుంబ సమేతంగా సభ్యులు వచ్చారు . ఇప్పటి వరకు మన సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడ పని చేసేవారైనా సభ్యత్వం తీసుకోవచ్చు అనే నిబంధన ఉంది , దీనిని సవరించి హైదరాబాద్ లో పని చేసేవారికే సభ్యత్వం అనే నిబంధన పెడదాం జనరల్ బాడీ ఆమోదిస్తే , అని చదివి చప్పట్లతో ఆమెదించిన తరువాత కానీ ... ఇలాంటి నిబంధన ఒకటి ఉందని తెలియలేదు .   ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో పని చేసిన వారు హైదరాబాద్ లో  సభ్యత్వం పొందింది ఈ నిబంధన వల్లే .  దీనిని ఎత్తివేసిన తరువాత కానీ నాలాంటి వారికి తెలియలేదు . 95 నుంచి వెయిటింగ్ లిస్ట్ కే పరిమితం .అంటే ఆశగా మా అన్నది ఇంతకన్నా విషాదం .  కరీం నగర్ లో ఈనాడు ఎడిషన్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి కొందరిని అక్కడకు బదిలీ చేశారు . అప్పుడు సొసైటీ అధ్యక్షుడు ఈనాడులోనే ఉన్న రాహుల్ . మీకు బదిలీ అయింది కదా ? మీ సభ్యత్వం వెనక్కి తీసుకోండి అని రాహుల్ సలహా .  ఎక్కడెక్కడి వారికో  విశాల హృదయంతో హైదరాబాద్ లో సభ్యత్వం ఇచ్చిన పెద్దలు హైదరాబాద్ లో పుట్టి , హైదరాబాద్ లోనే జర్నలిస్ట్ గా పని చేస్తున్న వారికి బదిలీ అయింది అని సభ్యత్వం వెనక్కి ఇచ్చారు . నా ఒక్కడికే ఈ నిబంధన ఏమిటీ , మీ వారిసభ్యత్వం ఎందుకు రద్దు చేయరు , ప్లాట్స్ మీ సొంత జాగీరు కాదు కదా ? అని ప్రశ్నించక పోవడం తప్పు . గోపన్ పల్లిలో 9 ఎకరాలు ఉంది , ప్రభుత్వం అది ఇస్తే  వెయిటింగ్ లో ఉన్న అందరికీ ప్లాట్ వస్తుంది అంటే ఆశగా ఎదురు చూపులు . ********2004 ఎన్నికలకు సన్నాహాలు . ఓ రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు అందరూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో మాట్లాడుతుంటే ... బాబుగారిని కలిసి మీ సొసైటీకి ల్యాండ్ కేటాయించమని అడగండి   అని సలహా ... ఎప్పుడో అడిగాం , జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇవ్వడం మా పాలసీ కాదు ,  ఇవ్వం అని నిర్మొహమాటంగా చెప్పారు అని  సమాధానం . అప్పటి మాట వదిలేయండి ఇది ఎన్నికల సమయం , ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారు అని ఉమ్మారెడ్డి సలహా . గుర్తున్నంత వరకు నేను , అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న రాముశర్మ , జ్యోతి వాసిరెడ్డి శ్రీనివాస్ , ఈనాడు సీఎస్ ఆర్ , సారధి బాబును కలిసి సొసైటీకి స్థలం అడిగితే ఒకే  అని బదులిచ్చారు .  టీడీపీ  బీట్ రిపోర్టర్ లు బోలెడు ఆనందపడిపోయారు .తరువాత సచివాలయ రిపోర్టర్ లు సంబంధిత అధికారిని కలిస్తే  .. రిపోర్టర్ లు అందరూ వెళ్లి అడిగితే ఏదో బాబు అలా హామీ ఇచ్చారు కానీ , మాకు ఏమీ చెప్పలేదు . మీరు ఆశలు పెట్టుకోకండి అని ఆశల మీద నీళ్లు చల్లారు . ఐతే బాబు ఉట్టుట్టి హామీ ఇచ్చినా ... తరువాత సొసైటీకి ల్యాండ్ కేటాయింపులో ఈ ఉట్టుట్టి హామీ ఎంతో మేలు చేసింది . టీడీపీ బీట్ రిపోర్టర్ లు ఎన్నికల ముందు బాబును కలిస్తే , కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ లు గుర్తున్నంత వరకు నేమాని భాస్కర్ , వంశీ ఇతర రిపోర్టర్ లు వై యస్ ఆర్ ను కలిసి ఈ ఎన్నికల్లో బాబు గెలిస్తే సొసైటీకి ల్యాండ్ ఇస్తాను అని హామీ ఇచ్చారు . మీరు గెలిస్తే మీరు ఇవ్వాలి అని ఓ వినతి పత్రం ఇస్తే వైయస్ ఆర్ సరే అని హామీ ఇచ్చారు . జర్నలిస్టులు 9 ఎకరాల గురించి వినతి పత్రం ఇస్తే , అది వదిలేయండి అని వైయస్ ఆర్ అందరు జర్నలిస్టులకు సరిపోయే విధంగా 72 ఎకరాలు కేటాయించారు . *****ఐదేళ్ల సీనియారిటీ వల్ల సభ్యత్వం దక్కని వారు వైయస్ ఆర్ ను కలిస్తే న మాట విని వెళ్ళండి , 2009 లో కూడా నేనే సీఎం అవుతాను , మీ అందరికి కూడా నేనే ఇస్తాను అని చెప్పి పంపారు . ఐనా కొందరు కోర్టుకు వెళ్లడం , హై కోర్ట్ , సుప్రీం కోర్ట్ ల లో రెండు దశాబ్దాల పయనం .  సామాన్యుల సమస్యలు పరిష్కరించడం అంత కష్టం కాదు . చివరకు అయోధ్య , కాశ్మీర్ సమస్య పరిష్కరించడం కూడా అంత కష్టం కాదు . కానీ మేధావుల సమస్య లు పరిష్కరించడం అంత ఈజీ కాదు .మొట్టమొదట కోర్ట్ర కు వెళ్ళింది  జర్నలిస్ట్ లే .. ఒక్క సారి వ్యవహారం  కోర్ట్ కు వెళితే .. తాతలు దిగివస్తారు .  పెళ్లయిన కొత్తలో హౌసింగ్ సొసైటీ లో సభ్యత్వం తీసుకొంటే ..    కోర్ట్ తీర్పు వచ్చేనాటికి  తాత లు అయిన వారు కూడా ఉన్నారు . బాబు మాట తప్పారు , వైయస్ ఆర్ ఇచ్చారు , తరువాత వచ్చిన రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు . తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ జోక్యం వల్ల, ప్రధాన న్యాయమూర్తి       జస్టీస్ రమణ గారి వల్ల సుప్రీంలో   కేసు కదిలింది . తీర్పు వచ్చింది . సుప్రీం తీర్పు తరువాత నిజాం పేట స్థలం సొసైటీకి అప్పగించిన ప్రభుత్వం . పేట్ బషీర్ బాద్ స్థలం విషయం ఎటూ తేల్చలేదు . మేం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ల్యాండ్ సమస్య పరిష్కరిస్తాం అని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందరోజుల్లో హామీ నెరవేరుస్తారు అని  అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు  . ఇంకో నెల రోజుల్లో వంద రోజులు అవుతాయి . అంతులేని కథ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు మొదలయింది .  సీఎంగా  కథ కు శుభం పడుతుందా ?   అంతులేని కథ ఇంకా సాగుతుందా ? న్యూస్ పేపర్ లో చూడాలి . ******ఉచితంగానా ? కాదు కానే కాదు , 2005-6 లోనే  ఒక్కో జర్నలిస్ట్ రెండేసి లక్షలు చెల్లించి ప్రభుత్వ ధరకు ల్యాండ్ కొన్నారు . అప్పుడు రెండు లక్షలు అంటే యాదగిరిగుట్ట , భువనగిరి ప్రాంతాల్లో ఒకటి రెండు ఎకరాల భూమి కొనవచ్చు .  కొసమెరుపు   : అదే సమయంలో వైయస్ ఆర్ ఐఏఎస్ ,  ఐ పి యస్ ,  శాసన సభ్యులకు ల్యాండ్ కేటాయించారు .  జర్నలిస్ట్ లకు సంబంధించి కనీసం తీర్పు వచ్చింది . వారిది ఇంకా తీర్పు కూడా రాలేదు . ఇది నా ఒక్కడి కథ . ఒక్కొక్కరిది ఒక్కో పుస్తకం రాసేంత గాధ ఉంటుంది . రాస్తూ పోతుంటే అంతులేని కథకు అంతు  ఉండదు . - బుద్దా మురళి 

29, నవంబర్ 2023, బుధవారం

తిక్కవరపు ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి .. టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106

తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106 ---------------------- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది . ఆ రోజులు అలా కాదు . ఎన్టీఆర్ ను గద్దె దించడానికి పార్టీలో పుట్టిన ముసలంలో ఈ భోజనం ఎపిసోడ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహించింది . ఎన్టీఆర్ దంపతులు సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్ళగానే బాబు వర్గం రంగంలోకి దిగింది . లక్ష్మీ పార్వతి పార్టీని అపవిత్రం చేస్తోంది అనేది ఆ వర్గం ప్రచార సారాంశం . భోజనానికి వెళితే అపవిత్రమా ? అంటే వారి దృష్టిలో అంతే .. వారు అలా భావించడానికి ఓ కారణం ఉంది . హిమాయత్ నగర్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు , తరువాత భవన్ లో టీడీపీ నాయకులతో సరదా సంభాషణల్లో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటీ అంటే పలువురు రెండు రూపాయలకు కిలో బియ్యం అని గర్వం గా చెప్పేవారు . రెండు రూపాయలకు కిలో బియ్యం సిద్ధాంతం కాదు ఆదో స్కీమ్ అని గుర్తు చేస్తే ... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరు నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అనే వారు . ఒక పార్టీని వ్యతిరేకించడం మరో పార్టీ సిద్ధాంతం ఏమిటో ? ఒక వేళ కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనుకోండి అప్పుడు మీ పార్టీకి సిద్ధాంతం లేకుండా పోతుంది కదా ? అని చమత్కరించేవాడిని . నిజానికి ఆ కాలం లో కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనే మాట ఊహకు అందనిది . ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆంధ్ర లో కాంగ్రెస్ లేకుండా పోతే , తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది . ***** తిక్కవరపు ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్ళాక పార్టీలో బాబు వర్గం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది అనే గుస గుస ప్రచారం మొదలు పెట్టారు .తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుడు , రాజ్యసభ సభ్యులు , కేంద్ర మంత్రి అయినా ఆయన పలుకుబడి కాంగ్రెస్ కె పరిమితం కాలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఆ కాలంలో కూడా ఆయన్ని ప్రచార పిచ్చి ఉన్న నాయకుడు అనే చూశారు కానీ ఢిల్లీలో అయన పలుకుబడి ఎలాంటిదో టీడీపీ రాజ్య సభ సభ్యులుగా ఉన్నప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓ సారి చెప్పారు . ఆయన ఢిల్లీలో పార్టీ ఇస్తే కేంద్రమంత్రులు ,ఆ న్నీ పార్టీల నాయకులు .... బడా బడా అధికారులు , సినిమా హీరోలు, హీరోయిన్ లు వచ్చేవారట . కనులతోనే ఎవరి అవసరం ఏమిటో గ్రహించేసే వారట .. అక్కడి పెద్దలు .. అంతటి సుబ్బిరామిరెడ్డి కంస్ట్రక్షన్ సంస్థ వేల కోట్ల అప్పులతో చేతులు ఎత్తేసింది . దివాళా ప్రక్రియ సాగుతోంది . లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు చేరువ చేస్తోంది అని ప్రచారం ప్రారంభించిన బాబు వర్గం బాస్ బాబే స్వయంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు . ఆ తరువాత లక్ష్మి పార్వతిపై టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం . ఎన్నికలు వచ్చాయి . కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు . 95 వెన్నుపోటులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయతినించారు అని మళ్ళీ వార్తలు . అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు జోక్యం చేసుకోక పోవడం ద్వారా పరోక్షంగా బాబుకు సహకరించారు . ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి . లోక్ సభ సీట్లు మీకు , అసెంబ్లీ మాకు .. బాబును దించేయాలి అని ఎన్టీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నారని బాబు మీడియాలో ప్రచారం . బాబు సీఎంగా కుదురుకోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం అని కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఎన్నికలు రాకముందే మరణించారు . ఎన్టీఆర్ నిజంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారా ? బేరం కోసం ప్రయత్నించారా ? అంటే ఆ మాట చెప్పల్సింది ఎన్టీఆర్ , వార్తలు రాయించిన బాబు ... చెప్పడానికి ఎన్టీఆర్ లేరు . బాబు చెప్పరు . **** సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్లడం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ? ఖమ్మంలో కాంగ్రెస్ నేత ప్రియాంక సభ లో టీడీపీ జెండాలు రెపరెపలడాయి . కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇదేం కొత్తకాదు 2018 లోనే చెట్టాపట్టాలేసుకొని పోటీ చేశారు కదా ? అంటే నిజమే 2018 లో కాంగ్రెస్ , టీడీపీ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంది . ఈ సారి పొత్తుకాదు ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కాంగ్రెస్ విజయానికి టీడీపీ పని చేస్తోంది . కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ కాంగ్రెస్ కోసం తమ పార్టీని మూసేసుకుంది . ఒక్క సీటు కూడా లేకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది . ఒక్క సీటు లేకుండా కోదండరాం పార్టీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . ఆ రెండు పార్టీల దారిలోనే టీడీపీ సైతం కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . 2014 కాలం లో బాబు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఖాళీ చేయడానికి టీడీపీ బీరు సీసా కాదు అన్నారు . ఖాళీ బీరు సీసాకు కూడా కొంత విలువ ఉంటుంది . కానీ బాబు మాత్రం ఉచితంగానే తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీని ఇచ్చేశారు . బాబు గ్రేట్ ---------- సుబ్బిరామిరెడ్డి ఇంటికి భోజనానికి వెళితే పార్టీని అపవిత్రం చేస్తున్నారని ప్రచారం చేసి దాన్ని నమ్మించిన బాబు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా , ఉచితంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నా టీడీపీ శ్రేణులు , నేతలు ఏమంటున్నారు ? అంటే ? ఏమీ అన్నారు బాబు ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేట్టు ట్యూన్ చేయడంలో బాబు విజయం సాధించారు . ప్రజలను ట్యూన్ చేయడంలో బాబు విఫలం అయి ఉండవచ్చు కానీ పార్టీని ట్యూన్ చేయడంలో ఘన విజయం సాధించారు . - బుద్దా మురళి

5, నవంబర్ 2023, ఆదివారం

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105 ......... ....... సాధారణంగా ప్రధాన మీడియాలో ఒక్కో పార్టీ గురించి ఎం సైజులో వార్తలు వస్తే జనంలో ఆ పార్టీకి ఆ సైజుకు తగ్గ ఆదరణ ఉంది అనిపిస్తుంది . వార్తల సైజులను బట్టి ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎన్ని సీట్లు రావచ్చు అనే అంచనాకు వస్తారు . పాఠకులే కాదు.. రాజకీయ నాయకులు చివరకు జర్నలిస్ట్ లు కూడా ఇదే అంచనాతో ఉంటారు . ఓ ఏడాది క్రితం మీడియా బిజెపికి హైప్ ఇచ్చింది . తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని సూచించే స్థాయిలో ఆ వార్తలు ఉండేవి . మీడియా + రాజకీయ నాయకులు ఐన వి 6 వివేక్ వెంకటస్వామి లాంటి వారు బిజెపిలోకి , బిజెపి నుంచి కాంగ్రెస్ కు ఇలా అనేక పార్టీలు మారింది ఇలాంటి వార్తలు హైప్ వల్లనే . మీడియా కలిగించే ఈ హైప్ లో చివరకు మీడియా కూడా పడిపోతుంది . చిత్రంగా మేధావులపై ఈ హై ప్ ప్రభావం తీవ్రంగా పడి తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు . కానీ ఓటర్లపై ఈ హైప్ ప్రభావం తక్కువే అనేక సందర్భాల్లో తేలింది . తాము సృష్టించిన వార్తలను నమ్మి మీడియా తామే బోల్తా పడుతోంది కానీ జనం పెద్దగా లెక్కేలోకి తీసుకోవడం లేదు . మద్య నిషేధ ఉద్యమ సమయంలో స్పోర్ట్ పేజీ మినహా ఈనాడు మొత్తం మద్య నిషేధ వార్తలతో నిండి పోయేది . ఉమ్మడి రాష్ట్ర జనాభాను మించి రాష్ట్ర జనాభా మద్య నిషేధ ఉద్యమం లో ఉన్నారు అనిపించేది . జోనల్ పేజీ , జిల్లా పేజీ , మెయిన్ పేజీ ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా మద్య నిషేధ ఉద్యమం లో పాల్గొన్నారు అనిపించేది ఈనాడు చదివితే .. అది మీడియా సృష్టించే మాయాజాలం . మద్యానికి వ్యతిరేక ప్రచారం , మద్యం తాగడం వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో మీడియా ప్రచారం చేయాలి . దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది . కానీ అక్కడ ఆ ప్రచార ఉద్దేశం ఒక పార్టీని ఓడించి ఒక పార్టీని గెలిపించడం ... నిజానికి నిషేధ సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మందు తాగడానికి ఉద్యమ స్థాయిలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు . సరిహద్దుల్లో మద్యం షాప్స్ వెలిశాయి , ఎందరినో సంపన్నులను చేశాయి . ******* ప్రధాన మైన టివి మీడియా , ప్రింట్ మీడియా లో ఎం . ఐ . ఎం పార్టీ వార్తలు అస్సలు కనిపించవు. గత రెండేళ్ల నుంచి షర్మిల పార్టీ వార్తలు కొన్ని మీడియాల్లో ఆమెనే సీఎం అన్నట్టుగా ప్రచారం చేశారు . జగన్ ను వ్యతిరేకిస్తూ , బాబును అభిమానించే మీడియా జగన్ సోదరి పార్టీని ఆకాశానికి ఎత్తారు . చివరకు పోటీ చేస్తే డిపాజిట్ ఎక్కడా రాదు అని తెలిసి ఆమె పోటీ చేయడం లేదు , ఆమె పార్టీ పోటీ చేయడం లేదు . షర్మిల పార్టీకి ఇచ్చిన ప్రచారంలో ఏడు సీట్లు గెలిచే mim కి ఒక్క శాతం ప్రచారం కూడా ఇవ్వలేదు . ఇక్కడ ఉద్దేశం ప్రచారం ఇవ్వళ్ళూ అని కాదు . మీడియాలో లభించే ప్రచార సైజు చూసి పార్టీలను అంచనా వేయవద్దు అని చెప్పడమే . అదే బీజేపీ వార్తలు చూస్తే ఏడాది క్రితం వరకు వాళ్లే అధికారంలోకి వస్తారేమో అన్నంతగా మీడియాలో ప్రాధాన్యత లభించింది . గత ఎన్నికల్లో mim కు ఏడు సీట్లు వస్తే బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు . కానీ మీడియాలో ఈ రెండు పార్టీలకు వచ్చిన వార్తలను పోలిస్తే అసలు సంబంధమే ఉండదు . ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఏడు స్థానాలు mim కు వదిలేసి మిగిలిన సీట్ల గురించే ఏ పార్టీ ఐనా ఆలోచించాలి . పోలింగ్ కు ముందే ఫలితాలు తేలిపోయే నియోజక వర్గాలు ఇవే . గత ఎన్నికల్లో తెలంగాణ లో మీడియా వార్తల ప్రకారం చూస్తే మహాకూటమి గెలుస్తుంది అని , ఆంధ్ర లో టీడీపీ అని మెజారిటీ మీడియా వార్తలతో హోరెత్తిందించి . తాము గెలవాలి అని కోరుకున్న పార్టీ గెలుస్తుంది అని మీడియా చెబుతోంది కానీ ఎవరు గెలుస్తారో చెప్పడం లేదు . **** 2012-13 సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా లాబీ లో చర్చ . అప్పుడు హైదరాబాద్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు శాస్త్రి ఇక తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే కదా ? అని కవ్విస్తున్నట్టు అడిగాడు . ఉద్యమం ఒక సారి ఉదృతంగా సాగుతుంది .పత్రికల నిండా ఏవ్ వార్తలు ఆ ఉదృతి చూసి వారం లో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపిస్తుంది . కొంత కాలం స్థబ్దతగా ఉండేది ఆ సమయంలో మీడియాలో సైతం వార్తలు కనిపించవు . దాంతో తెలంగాణ ఉద్యమం అయిపొయింది అనుకునేవారు . మీడియాలో వచ్చే వార్తల సైజును బట్టి తెలంగాణ పై నువ్వు అంచనాకు వస్తున్నావు . మీడియా లో వార్తల సైజుతో సంబంధం లేదు . తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణ అంశం ఉంటుంది అని వార్తల సైజుకు నిర్ణయాలకు సంబంధం ఉండదు అని అని చెప్పాను . సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మీడియా మొత్తం అవే వార్తలు . ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి ఆ ఉద్యమ వార్తలు చూపుతూ ఇప్పటికీ తెలంగాణ వస్తుందా ? అని అడిగితే .. ఆ వార్తల సైజులు మీడియా ఓనర్లను సంతృప్తి పరుస్తాయి నిర్ణయంలో ఎలాంటి ప్రభావం చూపవు వస్తుంది అని చెప్పాను .. ***** 1978 లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గోడల మీద జనతా పార్టీ గుర్తు నాగాలిపట్టిన రైతు బొమ్మ ఉండేది . జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది అనుకున్నాను . దేశమంతా వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ లో జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు . ఆ తరువాత చదువు పూర్తయి జర్నలిజంలోకి వచ్చాక మీడియాలో వచ్చే వార్తల సైజుకు జనంలో పార్టీకి వచ్చే ఓట్లకు సంబంధం లేదు అని అర్థమయింది . ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పక్ష పాతం అనే మాటకు తావు లేకుండా ఏ పార్టీ మీడియా ఆ పార్టీని ఆకాశానికి ఎత్తుతోంది . ఒక పార్టీ మీడియాకే పరిమితం కాకండి అన్ని పార్టీల మీడియా ను చదవండి , చూడండి .. అలానే సొంత కులం వారితోనే కాకుండా అందరితో మాట్లాడండి ఓ నిర్ణయానికి రండి . ఏదో ఒక పార్టీ మీడియా ను ఫాలో అయి ఎన్నికల ఫలితాలపై పందెం వేస్తే దెబ్బ తింటారు . డబ్బులు ఊరికే రావు . - బుద్దా మురళి

3, నవంబర్ 2023, శుక్రవారం

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104 --------------------------------------- రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలం లో చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ . కానీ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా లోని కొన్ని పేర్లు చూడగానే పూర్వ విద్యార్థుల సమావేశం అంత ముచ్చటేసింది . డిగ్రీ చదువుకొనే రోజుల నుంచే జర్నలిజం నుంచి సహవాసం కావడం వల్ల అప్పుడు విన్న , పరిచయం ఉన్న ఆ పేర్లు కొన్ని పాత జ్ఞాపకాలు తట్టి లేపాయి . పూర్వ విద్యార్థులు సమ్మేళనం లో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చినట్టు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి . కరోనా తరువాత ఎవరు ఉన్నారో , ఎవరు ఏమయ్యారో తెలియదు .. అలాంటప్పుడు మనం మరిచి పోయిన కొందరు ఉన్నారు అని తెలియడమే కాకుండా , వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే ముచ్చటేయడం సహజమే కదా ? సాధారణ నాయకులే కాదు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం ఇంటికే పరిమితం అయిన తరువాత వారిని ప్రజలు మరిచిపోతారు . ఓడినా గెలిచినా నాయకులు జనాల్లో ఉంటేనే రాజకీయంగా సజీవంగా ఉన్నట్టు . జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా , కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు . ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు . అయన మరణించినప్పుడు రిపోర్టర్ గా సమాచారం కోసం ఇంటికి వెళ్ళాను . చడీ చప్పుడు లేదు . అయన గురించి అడిగితే చెప్పేవారు దొరక లేదు . ఇంట్లో జలగం ఆత్మకథ గ్రంధం ఉంది . తీసుకువెళ్ళండి అని ఒకరు సలహా ఇస్తే ... వార్త సాయిబాబా అప్పటికే బుక్ వెతుకుతుంటే నేనూ ఒకటి తీసుకున్నా .. అయన పోయారు అనే వార్త విని ఆయన ఉన్నారా ? ఎక్కడా వార్తల్లో కనిపించలేదేమబ్బా అనిపించింది . ***** జర్నలిస్ట్ గ్రూప్ లో బిజెపి మూడవ జాబితా కనిపించగానే చదువుతుంటే కొన్ని పేర్లు చూసి మొదట అనుమానం వచ్చింది . తరువాత బిజెపి జాబితానే అని నిర్ధారణ చేసుకొని పేర్లు చదివి సంతోషించాను . చేవెళ్ల నుంచి రత్నం , అంబర్ పేట కృష్ణ యాదవ్ , జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి , సికిందరాబాద్ మేకల సారంగపాణి ఇలా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నా టీడీపీ కార్యకలాపాల్లో నగరంలో వీరి హడావుడి చాలా ఉండేది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరి హడావుడి కనిపించేది .తరువాత వీరు ఏమయ్యారో తెలియదు . హఠాత్తుగా వీరి పేర్లు చూసే సరికి ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా .. ఉన్నారు అని సంతోషం . మేకల సారంగపాణి ఒకప్పుడు టీడీపీ నగరనాయకుల్లో ఒకరు . కార్పొరేటర్ స్థాయికి పరిమితం కాకూడదు శాసన సభ్యున్ని కావాలి అని ఆశ ప్రజారాజ్యం పెట్టగానే పోటీ చేసి ఓడిపోయారు . తరువాత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో బీజేపీ లో ఎప్పుడు చేరారో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ సికిందరాబాద్ అభ్యర్థి అయ్యారు . చేవెళ్ల రత్నం ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో జిల్లా పరిషత్ చైర్ మెన్ గా చివరి వరకు ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు . తరువాత కనిపించలేదు . లంకల దీపక్ రెడ్డి చివరి దశలో చేరినా హడావుడి ఎక్కువగానే ఉండేది . తెలుగుదేశంలో కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు . హఠాత్తుగా మంత్రి వర్గం నుంచి బాబు తొలగించారు . ఎందుకో ఏ మీడియా రాయలేదు . ఎవరికీ తెలియదు . కొన్ని రోజుల తరువాత వేల కోట్ల రూపాయల తెల్గీ స్టాంప్ కుంభకోణంలో కృష్ణ యాదవ్ పాత్ర ఉందని అరెస్ట్ చేశారు . ఓహో బాబుగారు మంత్రివర్గం నుంచి తొలగించింది ఇందుకా అని అప్పుడు తెలిసింది . జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి టీడీపీ కోసం కృష్ణ యాదవ్ బాగా ప్రయత్నించారు . చేరలేదు . తెలంగాణ ఏర్పడింది . టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది . తరువాత తెరాస లో చేరారు . తెరాస లో ఉన్నారో లేరో అన్నట్టు ఉండేది . బీజేపీ మూడవ జాబితా తో మళ్ళీ తెరపైకి వచ్చారు . మాంసం తిన్నామని ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు అనే సామెతలా .. తెల్గీ నుంచి కృష్ణ యాదవ్ తిన్నది కొద్దిగానే ఐనా శిక్ష చాలా ఎక్కువగా అనుభవించారు అని ప్రచారం . తెల్గీ కుంభకోణం బయటపడి , కృష్ణ యాదవ్ అరెస్ట్ అయ్యాక అయన వార్తలు పత్రికల్లో చందమామ కథల్లా కనిపించేవి . కృష్ణ యాదవ్ అంతకు ముందు ఏ జిల్లాలో తిరిగాడో ఆ జిల్లా నుంచి కథలు వచ్చేవి ఆ జిల్లాలో ఎవరెవరిని కలిశాడు , ఏం జరిగింది అని వార్తలు వచ్చేవి . తెల్గీ కన్నా ఎక్కువ శిక్ష పడింది యాదవ్ కె మంత్రి పదవి పోయింది , జైలు జీవితం తప్పలేదు . రాజకీయ జీవితం ముగిసింది . ******* మీడియాలో జోనల్ పేజీలు వచ్చాక ఏ జోనల్ నాయకులు ఆ జోనల్ పేజీలోనే కనిపిస్తున్నారు . ఇతర జోన్ లలో ఉండే పాఠకులకు వీరు ఉన్నారని తెలియదు . ఏ పార్టీలో ఎప్పుడు చేరారో తెలియదు . జోనల్ జీవితం వల్ల ఒక జోనల్ నాయకుల రాజకీయం ఇంకో జోన్ వారికి తెలియకుండా పోయింది . కనీసం ఎన్నికల వల్ల నైనా వారు ఉన్నారు అని తెలుస్తోంది . ఎన్నికల జాతర వచ్చినప్పుడు టికెట్ కోసం ప్రయత్నించేవారు పేర్లు పత్రికల్లో చదువుతుంటే వీళ్ళు ఇంకా ఉన్నారా ? మరిచే పోయాం అనిపిస్తుంది . నాయకుల గురించి మీడియా ఇలా అనుకుంటే మీడియా వాళ్ళ గురించి నాయకులు కూడా ఇంకా ఉన్నారా ? అనే అనుకుంటారు . రాస్తూంటేనే జర్నలిస్ట్ జీవించి ఉన్నట్టు .. పోటీ చే స్తుంటే, .. రాజకీయాలు చే స్తుంటేనే రాజకీయ నాయకులు రాజకీయంగా జీవించి ఉన్నట్టు .. రచయితలు , సినిమా నటులు సైతం అంతే కలం వదిలేసి, నటన మానేసి అస్త్ర సన్యాసం చేస్తే అంతే ... - బుద్దా మురళి

30, అక్టోబర్ 2023, సోమవారం

తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103

తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103 --------------------------------------- తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంగా మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది . ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఈసారి పోటీ చేయడం లేదు అంటే . తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టు . తెలంగాణలో 1999 ఎన్నికలే టీడీపీ గెలిచిన చివరి ఎన్నికలు . 24 ఏళ్ళ నుంచి తెలంగాణ లో పెద్దగా ప్రభావం లేదు . ఐతే ఈ సారి పోటీ చేయడం లేదు అంటే తెలంగాణలో టీడీపీ చరిత్ర అధికారికంగానే ముగిసినట్టు . వారం క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షడు తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు . ఆరు నెలల క్రితం ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది . పాత టీడీపీ వారంతా టీడీపీలోకి వచ్చేయండి అని బాబు పిలుపు ఇచ్చారు . ఈ పిలుపును అందుకొని ఎవరెవరు రాబోతున్నారో తెలుగు ఛానల్స్ వారం రోజుల పాటు చర్చలతో ఉదరగోట్టాయి . ఒక్కరూ రాలేదు . పైగా బాబైనా పార్టీ మారుతాడేమో కానీ ఈయన మారడు అని పేరున్న రావుల చంద్ర శేఖర్ రెడ్డి కూడా టీడీపీని వీడి వెళ్లారు . తెలంగాణ జనంలో టీడీపీకి లేకపోవచ్చు కానీ మీడియా గుండెల్లో బాబు గూడు కట్టుకొని ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ప్రచారం చేసే దమ్మున్న మీడియా టీడీపీకి ఉంది . ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజకీయ పార్టీకి ఉనికి . పోటీకి దూరం కావడంతో అధికారికంగా తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టే . పార్టీ పుట్టుక నుంచి ముగింపు వరకు పలు కీలక సంఘటనల్లో ప్రత్యక్ష సాక్షిని .. ***** క్లిక్ మని ఫ్లాష్ వెలగగానే ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆ ఫోటో గ్రాఫర్ వైపు కోపంగా చూశారు . మార్వాడి షాప్ లో కనిపించే పరుపు గద్దె మీద ఎన్టీఆర్ కూర్చొని ఉన్నారు . పక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు . ఫోటో గురించి నాదెండ్ల ఏదో చెప్పే సరికి ఎన్టీఆర్ మాములు అయ్యారు . ఇది 1982లో రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ను టీడీపీ నాయకుడి పాత్రలో తొలిసారి చూసిన సందర్భం . అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను . పదవ తరగతి పరీక్షలు రాస్తున్న కరీం నగర్ జిల్లాకు చెందిన మిత్రుడు భూపాల్ తీసుకువెళితే రామకృష్ణ స్టూడియోకు వెళ్ళాను . కొత్తగా పెట్టిన టీడీపీలో జిల్లాల వారిగా నాయకులతో ఎన్టీఆర్ సమావేశం . ఆ రోజు కరీం నగర్ సమావేశం కావడంతో తనకు తెలిసిన వారు టీడీపీలో చేరుతున్నారని , వారితో ఎన్టీఆర్ సమావేశం ఉంది వెళదాం అంటే స్టూడియోలోకి వెళ్ళాను . దాదాపు ఓ వందమంది ఉండవచ్చు . అంతకు ముందు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం ఎన్టీఆర్ అక్కినేని బృందం విరాళాలు సేకరిస్తుంటే సికింద్రాబాద్ దర్గా వద్ద రేఖా ఎంపోరియం లోకి వెళ్లి విరాళాలు తీసుకుంటుంటే చూశాను . కానీ టీడీపీ ఏర్పడ్డాక ఎన్టీఆర్ ను 82లో రామకృష్ణ స్టూడియోలో చూశాను . 84లో లో ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు తరువాత రామకృష్ణ స్టూడియో వద్ద పిట్టగోడ ఎక్కి వెంకయ్య నాయుడు బీజేపీ కార్యకర్తలు చేసిన ఉపన్యాసం , ఉద్యమం చూశాను . ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో టీడీపీ కన్నా బీజేపీ హడావుడి ఎక్కువ ఉండేది . ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లో స్టూడియో వద్ద బీజేపీ నాయకులదే ఎక్కువ హడావుడి . ఆ సమయంలో నేను అక్కడ ఎందుకు ఉన్నానో గుర్తు లేదు కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అప్పుడు ఆ స్టూడియో వద్దనే ఉన్నాను . చాలా మంది రోడ్డు మీద నిలబడి చూశారు . ఆ మరుసటి సంవత్సరం ఒక వైపు కాలేజీకి వెళుతూనే 1985 నుంచి ఉదయం స్థానిక విలేకరిగా టీడీపీని దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . విద్యార్థిగా , జర్నలిస్ట్ గా టీడీపీ పుట్టుక నుంచి మహోజ్వలంగా వెలిగిపోవడం , ఆరిపోవడం వరకు అన్ని కీలక పరిణామాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . ఎన్టీఆర్ ను దించేసిం వైస్ రాయ్ ఎపిసోడ్ నుంచి తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ నిర్వీర్యం కావడం వరకు ఆంధ్రభూమి నుంచి టీడీపీ రిపోర్టర్ గా అన్ని పరిణామాలను చూశాను . *** ఎం ఎల్ ఏ క్వార్టర్ లో టీడీపీ పుట్టిన సందర్భంలో అక్కడ లేను కానీ అటు నుంచి రామకృష్ణ స్టూడియోలో సమావేశాలు ప్రారంభం నుంచి .. తెలంగాణ లో పార్టీ శకం ముగియడం వరకు అన్నీ చూశాను . తెలంగాణ ఏర్పడినా 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఎన్నికలు జరిగాయి . ఒక ప్రాంతీయ పార్టీ ఒకే రాష్ట్రంలో ఉంటుంది . రెండు రాష్ట్రాల్లో ఉండదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల విభజనను అంత త్వరగా జీర్ణం చేసుకోరు . ఆ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాల్లో గెలిచింది . ఓటుకు నోటు తెరాస కు వరంలా మారింది . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ మహాకూటమి మీడియాతో కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నారు అనే భావన కలిగించడంలో విజయం సాధించారు . మంత్రివర్గాలను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు . ఫలితాల్లో బోల్తా కొట్టారు . ప్రచారంలో బాబు సింహా భాగం ఆక్రమించారు . తీరా రెండు సీట్లకు పరిమితం అయ్యారు . 150 డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి ఒక్క టంటే ఒక్క కార్పొరేటరే గెలిచారు . ఓటుకు నోటు కేసులు , పరాజయాలతో తెలంగాణ టీడీపీ నాయకులు తెరాస , కాంగ్రెస్ , బీజేపీ ఏదో ఒక పార్టీలో సర్దుకున్నారు . రిటైర్డ్ అయిన వారి కాలక్షేపం క్లబ్ తరహాలో ఎన్టీఆర్ భవన్ కొద్ది మందికి పరిమితం అయిపొయింది . ***** ఎందుకు పోటీ చేయడం లేదు .. రాజకీయ పక్షాలు నిజం చెప్పవు .. వారు చెప్పెది నిజం కాదు . ఐతే ఎందుకు పోటీ చేయడం లేదు అనే దానిపై నిజం చెప్పడం లేదు .. అబద్దం చెప్పడం లేదు . మరో ఆరు నెలల్లో ఆంధ్రాలో ఎన్నికలు . టీడీపీకి అవి చావుబతుకుల పోరాటం . తెలంగాణ లో అన్ని చోట్ల డిపాజిట్లు పోవడం ఖాయం .. డిపాజిట్లు పోతే ఆంధ్ర లో ఆ ప్రభావం పడుతుంది . బాబు జైలుకు వెళ్లిన తరువాత ఆంధ్ర కన్నా తెలంగాణలోనే నిరసన కార్యక్రమాలు ఎక్కువగా జరిగాయి . ఒక సామాజిక వర్గం వారాంతపు ఆట విడుపులా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీడియా మాత్రం జనప్రవాహం అని చెబుతోంది . డిపాజిట్లు పోతే ఓస్ సానుభూతి ఇంతేనా ? అని ఆంధ్ర లో గాలి పోతుంది . మరో వైపు ఈ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించాలి అని టీడీపీ అనుబంధ మీడియా ప్రయత్నాలు . టీడీపీ పోటీలో ఉంటే ఆ వర్గం అటు ఓటు వేయాలో ఇటు వేయాలో గందరగోళం . బి ఆర్ యస్ కన్నా రేవంత్ రెడ్డి అధికారం లో ఉంటే తానే అధికారంలో ఉన్నట్టు బాబు భావించడానికి అవకాశం ఉంటుంది . ఎలాగూ గెలిచే అవకాశం లేని ఒకటి రెండు శాతం ఓట్లతో పోటీ చేయడం కన్నా పోటీకి దూరంగా ఉండడం ప్రయోజనం అని టీడీపీ తెలంగాణలో తమ పార్టీకి మంగళం పాడింది . నిజానికి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో మంగళం పాడారు . ఇప్పుడు టీడీపీ కూడా మంగళం పాడింది . *** ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన గండిపేట కుటీరం , హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం ( ఎన్టీఆర్ ది , బాబుది తొలి పార్టీ కార్యాలయాలు హిమాయత్ నగర్ లో దగ్గర దగ్గరే ఉన్నాయి ) ఎన్టీఆర్ భవన్ ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలు . విశాలమైన , అత్యంత ఖరీదైన ఎన్టీఆర్ భవన్ అక్కడే ఉంటుంది కానీ తెలంగాణలో టీడీపీ రాజకీయాలు ఉండవు . తెలంగాణ ఉద్యమ కాలం లో టీడీపీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది .. ఇక్కడే ఉంటుంది అని బాబు చెప్పేవారు . ఇక్కడ పుట్టినా ఇప్పుడు ఆంధ్ర కే పరిమితం . హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎదురుగా విశాలమైన స్థలం కేటాయిస్తే .. బాబు దానిని ఎన్టీఆర్ భవన్ పేరుతో టీడీపీకి కేటాయించుకున్నారు . పేరుకు ఎన్టీఆర్ విధానాల పై అధ్యయనం , ప్రచారం కోసం ఈ భవన్ అని చెప్పినా పూర్తిగా టీడీపీ కోసం భవన్ ఉండేది . తెలంగాణలో ఇప్పుడు పార్టీ లేదు . విశాలమైన ఎన్టీఆర్ భవన్ మాత్రమే మిగిలింది . - బుద్దా మురళి

19, అక్టోబర్ 2023, గురువారం

కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి  బాబు కోసం  -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్  జ్ఞాపకాలు-  102-------------

కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి  బాబు కోసం  -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్  జ్ఞాపకాలు-  102----------------------------- ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే మా పిల్లలు బతుకమ్మ ఆట  చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు  తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదుదాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు .. చిత్తూరు జిల్లా నగిరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు .  ఇంటికి వెళ్లేప్పుడు  టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం అలవాటు .   1987లో రిపోర్టర్ గా ఉద్యోగంలో చేరాక పండుగలు , పబ్బాలు అంటూ ఏమీ లేవు . అన్ని రోజులు దాదాపు ఒకేలా గడిచిపోయేవి . 95లో హైదరాబాద్ వచ్చాక వారాంతపు సెలవు తప్ప ఏదీ గుర్తుండదు . తెలంగాణ ఉద్యమం దాదాపు అప్పుడే ప్రారంభం అయింది .  బతుకమ్మ పండుగా ఎలా ఉంటుందో చూపడానికి కంట్రీ క్లబ్ తమ క్లబ్ లో బతుకమ్మ ఆడించింది . ప్రాంతం ఏదైనా కావచ్చు , పండుగలు , ఆటలు అంటే పిల్లలకు ఇష్టం. బతుకమ్మ ఆట చూపడానికి కంట్రీ క్లబ్ కు  వచ్చాము అని రాధాకృష్ణ చెప్పిన తరువాత ఆలోచనలో పడిపోయాను .  బాల్యం అంతా కవాడిగూడ ,  బోలాక్ పూర్ , పద్మశాలి కాలనీ ల మధ్య గడిచిపోయింది . ఈ ప్రాంతాలు హుసేన్ సాగర్ కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటాయి . ఈ ప్రాంతాల్లో బాల్యంలో బతుకమ్మ  సందడిగా ఆడేవారు .  ఆ రోజుల్లో హుసేన్ సాగర్ ఇప్పటిలా ఉండేది కాదు . ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు .  బట్టలు  ఉతుక్కునే వారు , స్నానాలు చేయడం చూశాను . బతుకమ్మ పండుగ రోజుల్లో హుసేన్ సాగర్ కళకళ లాడేది . కవాడి గూడా , బోలాక్ పూర్ వంటి ప్రాంతలు దగ్గరే కాబట్టి బతుకమ్మ ఆడి హుసేన్ సాగర్ లో బతుకమ్మ విడిచేవారు . అక్క చెల్లెళ్ళతో చాలా సార్లు అలా వెళ్ళాను . ఏదో మంత్రం వేసి  మాయం చేసినట్టు  నగరంలో బతుకమ్మ మాయమైంది .గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ మొదటి నుంచి అలానే ఉన్నా నగరంలో మాయమైంది   అలాంటి బతుకమ్మ ను చూడాలి అంటే చివరకు కంట్రీ క్లబ్ కు వెళ్లాలా ? అనిపించింది ... స్వతంత్ర పోరాట కాలం లో తిలక్ గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి   స్వతంత్ర పోరాటం జరిపారు . తెలంగాణ ఉద్యమానికి దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు . *****  కవిత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు  తిరిగి పూర్వ వైభవం లభించింది . బడుగుల బతుకమ్మ అంటూ వామపక్ష బావాలు గలవారు పోటీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . పేరు ఏదైతేనేం బతుకమ్మ అంతటా మళ్ళీ కనిపించింది . గతంలో హైదరాబాద్ కాలనీల్లో బతుకమ్మ అంటే తెలియదు అన్నట్టు ఉండేవారు . తెలంగాణ ఏర్పడిన  తరువాత ఇప్పుడు కాలనీల్లో కూడా బతుకమ్మ కనిపిస్తోంది . బతుకమ్మ చూడాలి అంటే హనుమకొండ లోనే చూడాలి అనేవారు . ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు నగరంలోనూ బతుకమ్మ కనిపిస్తోంది . ఉద్యమానికి బతుకమ్మ ను ఉపయోగించుకున్నప్పుడు ప్రత్యర్థుల రాజకీయం సహజమే . బతుకమ్మ తెలంగాణ కు మాత్రమే చెందిన వేడుక కాదు విజయవాడలో కూడా ఆడుతారు అంటూ కొందరి వాదన . ఇదిగో ఆధారాలు అని కొందరు వ్యాసాలు రాస్తే ,  లగడ పాటి రాజ్ గోపాల్ విజయవాడలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . అప్పుడు టీడీపీలో నర్రా విజయలక్ష్మి అనే మహిళా నాయకురాలు ఉండేవారు . లగడపాటి రాజ్ గోపాల్ అన్న బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారు వెళుతున్నాను అంటూ మీడియా ముందు హడావుడి చేసి విజయవాడ వెళ్లారు . తెలంగాణ ఏర్పడిన తరువాత లగడపాటి అన్నగారు విజయలక్ష్మి చెల్లిని బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారో లేదో , చెల్లి వెళ్లారో లేదో తెలియదు . తెలంగాణ వచ్చాక  విజయవాడలో లగడపాటి  బతుకమ్మ వేడుకలు జరిపినట్టు వార్తలు అయితే రాలేదు .  ****  తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక చంద్రబాబు , బాలకృష్ణ లు కూడా బతుకమ్మ పూజ చేశారు . బోనం ఎత్తారు . ఐనా తెలంగాణ వచ్చింది . ఉద్యమ కాలం లో ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాలని ఏర్పాట్లు చేస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆడేందుకు వీలు లేదు అని ఆంక్షలు విధించింది . జాగృతి కోర్ట్ కు వెళ్లి అనుమతి  తెచ్చింది . తెలంగాణ ఏర్పడిన తరువాత అదే ట్యాంక్ బండ్ పై అధికారికంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపింది . సీఎం తో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు . ***స్కిల్  స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . బాబు విడుదలను కోరుతూ ట్యాంక్ బండ్ పై ఈ రోజు టీడీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ  ఆడుతున్నారు . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . తిరుపతి వెంకన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడే కాదు . ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ మొక్కుతారు . బతుకమ్మ అందరి పండుగ అనుకుంటే సంతోషమే .. అది గుజరాతీ పండుగా నా ? ఇది బిహారీ పండుగ , తెలంగాణ , ఆంధ్ర పండుగ అని కాదు ఎన్ని పండుగలు చేసుకునే వీలుంటే అన్ని చేసుకోవచ్చు జీవితం పండుగ మాయం అవుతుంది .  - బుద్దా మురళి 

15, అక్టోబర్ 2023, ఆదివారం

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101 చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పడుతుంది. కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట . ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర సత్యం .. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . ఇప్పుడెందుకు ఈ పాట అంటే . 2013 సాధారణ ఎన్నికలకు ఈ ఉదయం 55 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే తొలుత నాగర్ కర్నూల్ నియోజక వర్గం పేరు ఆసక్తిగా చూశాను . నాగం జనార్దన్ రెడ్డి పేరుకు బదులు రాజేష్ రెడ్డి అనే పేరు కనిపించగానే .. నాగంతో రెండు దశాబ్దాల సంఘటనలు గుర్తుకు వచ్చాయి . ఆ రోజుల్లో బాబు నంబర్ వన్ ఐతే దేవేందర్ గౌడ్ , నాగం జనార్దన్ రెడ్డి నంబర్ టూ అన్నట్టుగా ఓ వెలుగు వెలిగారు . ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా ముగింపు నాకు వచ్చింది . తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది నాగం పరిస్థితి అని గతంలో ఓ సారి రాశాను . రాజకీయా నాయకులు , అధికారులు , ఉద్యోగులు , వారూ వీరు అని కాదు కాలం మారుతుంది అనే విషయం , మారింది అనే విషయం అందరూ గుర్తించాలి .. లేక పోతే మరీనా పరిస్థితులను తట్టుకోలేక మానసిక ఆందోళన పాలవుతాం . అందుకే ఆ పాట గుర్తుకు వచ్చింది . ఆ పాట ఓ జర్నలిస్ట్ గా నాకూ వర్తిస్తుంది . మీకూ వర్తిస్తుంది . ************* 2004 ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశం . ఆ రోజుల్లో మంత్రి వర్గ సమావేశం అంటే ఇన్ సైడ్ సమాచారం కోసం కనీసం పది మంది మంత్రులనైనా కలవాల్సి వచ్చేది . మంత్రివర్గ సమావేశం ముగిసింది అని తెలియగానే సచివాలయం లోకి వస్తూ తొలుత నాగం జనార్దన్ రెడ్డి ఛాంబర్ లోకి ఇద్దరు ముగ్గురం జర్నలిస్ట్ లం వెళ్ళాం . లోపలి వెళుతూ నాగం కనిపించగానే ఏంటీ ఈ రోజు కేబినెట్ లో ఊపేశారట ! అని పలకరిస్తే ఆయన మురిసిపోయారు . మేము వెళ్లే సరికి ఛాంబర్లో వాళ్ళ నియోజక వర్గంలోని గ్రామం వాళ్ళు ఏదో పని కోసం వచ్చి ఉన్నారు . 2004 ఫలితాలు ఎలా ఉంటాయి అని నాగం అడిగితే , ఎలాంటి అనుమానం వద్దు మీ పార్టీ ఓటమి ఖాయం అని లెక్కలు చెప్పాను .. నువ్వు ఇలా చెబుతున్నావు కానీ , ఊరినుంచి వచ్చారు వీళ్ళతో ఇప్పుడే మాట్లాడాను గెలుస్తాం బాగుంది అంటున్నారు అని నాగం చెప్పారు . నేను లోపలి వస్తూనే ఏమన్నాను , క్యాబినెట్ లో ఊపేశారట కదా ? అన్నాను . నిజానికి ఈ రోజు క్యాబినెట్ జరిగింది అన్న విషయం తప్ప ఎవరు వచ్చారు , ఏం మాట్లాడారు నాకేం తెలియదు . నేరుగా మీ వద్దకే వచ్చాను . కేవలం ఇన్ సైడ్ సమాచారం కోసం మీ వద్దకు వచ్చి ఊపేశారట అని పొగిడాను . ఇదేమి పైరవీ కాదు , మీరు చెప్పక పోతే ఇంకో 30 మంది మంత్రులు ఉన్నారు . ఐనా మిమ్ములను పొగిడాను . సమాచారం కోసమే నేను మిమ్ములను పొగిడినప్పుడు , మీతో పని కోసం మీ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు గెలుస్తామని చెప్పక పోతే ఓడిపోతాం అంటారా ? అని చెబితే పక పక నవ్వారు . ******** బాబు హయాంలో నంబర్ 2 గా నాగం ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం లో రేవంత్ రెడ్డి తెరాస లో సాధారణ కార్యకర్త . అటు నుంచి రేవంత్ టీడీపీలోకి వచ్చారు . అప్పుడూ నాగం నంబర్ 2 నే .. తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడంతో నాగం కు ఎటూ పాలుపోలేదు . తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ , రెడ్డిగా వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డిపై ధ్వజ మెత్తుతూ టీడీపీ లో తన స్థానం సుస్థిరం అనుకున్నారు . కోదండరాం రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయ్యాక ఓ రోజు నాగం తెలంగాణ రెడ్డి నాయకునిగా కోదండరాం ఎమర్జ్ అవుతున్నారు అని కంగారు పడ్డారు . తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో బాబును వ్యతిరేకించినట్టు మాట్లాడి , సంచలనం రేకెత్తించి , కొద్ది సేపు సభలో విడిగా కూర్చొని తరువాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే అదే జిల్లాకు చెందిన మరో నేత ..తిరుగుబాటు చేసిన వారు అలానే ఉండాల్సింది బాబు పక్కన కూర్చోగానే నాగం ది అయిపొయింది ఆయనకు అర్థం కావడం లేదు అన్నారు . టీడీపీలో తాము వెలిగిపోతున్నప్పుడు కెసిఆర్ ఎక్కడో ఉన్నారు , ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలి అని అటు వెళ్ళలేదు . ఇటు కోదండరాం నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని తెలంగాణ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు . అటు నుంచి బిజెపి , బీజేపీలో అసంతృప్తి అటు నుంచి కాంగ్రెస్ . టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు . ఐనా టికెట్ పై ఆశలు పెట్టుకొని అలానే ఉన్నారు . నా లాంటి నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం ఏమిటీ అనుకున్న నాగం చివరకు తెరాస లో చోటా నాయకుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక . రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో పని చేశారు . రేవంత్ రెడ్డి టికెట్ఐ లు ఇచ్చే స్థానంలో ఉండగా .. నాగం టికెట్ అడిగే స్థానం లో ఉన్నారు . ఐనా టికెట్ దక్కలేదు . *********** ఉద్యమ కాలం లో చాలా మంది నాయకులకు చర్చల్లో ఓ మాట చెప్పేవాడిని . ఆంధ్రభూమిలో వెజ్ బోర్డు సిఫారసులు అమలు చేస్తారు . మంచి జీతాలు ఉంటాయి . నాకు భూమిలో దాదాపు ఏడు వేల రూపాయల జీతం వచ్చే రోజుల్లో ఏబీకే ప్రసాద్ సంపాదకునిగా సుప్రభాతం అని పక్ష పత్రిక వచ్చేది . రవిప్రకాష్ అందులో దాదాపు మూడు వేల రూపాయలకు రూపాయలకు ఉద్యోగం చేసేవారు . టివి 9 తో రవిప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయారు . భూమిలో ఏదన్నా తేడా వస్తే , ఎక్కడ ఉద్యోగం వచ్చినా చేస్తా కానీ అప్పుడు నాకు ఏడు , నీకు మూడు వేలే జీతం అంటే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అనే వాడిని . .. కాలం కారుతుంది . అలా మారుతుంది అని గ్రహించాలి , స్వీకరించాలి లేకపోతే తిరునాళ్లలో తప్పిపోయినట్టు అవుతుంది . - బుద్దా మురళి

13, అక్టోబర్ 2023, శుక్రవారం

జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100

జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100 -------------------------------------- రచయిత లారా మీరెటు వైపు అంటూ 1970 లో వినిపించిన ప్రశ్న 53 ఏళ్ళ క్రితం సాహిత్యంలో ఓ సంచలనం . అప్పుడు నేను ఇంకా స్కూల్ లో కూడా లేను కానీ ఆ ప్రశ్న గురించి ఆ తరువాత కూడా చాలా సార్లు చదివాను . అప్పటి వివాదం , అప్పటి చర్చ లోతుల్లోకి వెళ్ళలేను కానీ .. ఈ మధ్య వచ్చిన సినిమా పాట ఆ వైపు నుంటావా ? ఈ వైపు నుంటావా అని రంగస్థలంలో రాం చరణ్ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్న నే కావచ్చు . పైకి ప్రశ్న లానే ఉన్నా అందులో ఒక రకమైన బెదిరింపు కూడా ఉంది అనిపిస్తోంది . విప్లవ రచయితల సంఘం రచయిత లారా మీరెటువైపు అని అడిగిన ప్రశ్నలో మా వైపున ఉంటే ఒకే లేకుంటే అంతే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ చదువు చదివిన నాలాంటి వ్యక్తికి అనిపిస్తోంది . రచయితలు అంటే కొందరు అటు కొందరు ఇటూ అన్నట్టు , మరి కొందరు ఎటో తెలియనట్టు ఉండడం వల్ల అదో సంచలనం , సమాధానం కావలసిన ప్రశ్న . మరి జర్నలిస్ట్ లారా మీరెటు అంటే ? ******************** జర్నలిస్ట్ లారా మీరెటువైపు అని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లే కాదు , పత్రికలు చదివే పాఠకులు , ఛానల్స్ చూసే ప్రేక్షకులు కూడా క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు . కొందరు మేం తటస్థులం అని నటిస్తుంటారు . ఓ నిమిషం మాట్లాడితే ఏ పార్టీ తటస్తులో తేలిపోతుంది . తెలంగాణకు చెందిన ఓ ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ బీజేపీల మధ్య పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు . ఆ ఛానల్ ఓనర్ ఎటు మారితే ఛానల్ అటు మారుతుంది . జర్నలిస్ట్ తనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అనుకుంటాను కానీ యజమాని ఇష్టం వచ్చినట్టు రాయాలి , రాస్తారు . కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి , జీతాలు ఇచ్చి మీడియా సంస్థలను నడిపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకో , ప్రజల స్వేచ్ఛ కోసమో కాదు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 1950 ప్రాంతంలోనే సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే , దీనికి పెద్దగా విలువలు అంట గట్టకండి అన్నారు . మీడియాది వ్యాపారం అని జర్నలిస్టులకు , యజమానులకు , సంపాదకులకు , యూనియన్ నాయకులకు తెలియదా ? అంటే పాఠకులకే తెలిసినప్పుడు వారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది . దేవతా వస్త్రాల కథలా అందరూ నటించేస్తుంటారు . గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు మీడియా మొత్తం వివిధ పార్టీలకు అనుబంధంగా పని చేస్తోంది . యజమాని ఏ పార్టీకి అనుబంధంగా పని చేస్తే ఆ మీడియా జర్నలిస్ట్ తనకు నచ్చినా నచ్చక పోయినా ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే కోణం లోనే పని చేయాలి . ******* 95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అనేక వార్తల్లో , వ్యాసాల్లో నేను ఆంధ్రభూమిలో వెన్నుపోటు అని రాశాను . ఆ వెన్నుపోటులో మీడియా పాత్ర కూడా ఉంది . వారి పత్రిక తరపునే కాకుండా చిత్తశుద్ధితో వెన్నుపోటు కు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ మధ్య ఒక వ్యాసంలో 95 సంఘటన ప్రస్తావిస్తూ వెన్నుపోటు అని రాశారు . అది వెన్నుపోటు అని గ్రహించడానికి ఆ జర్నలిస్ట్ కు పాతికేళ్ళు పట్టిందా ? అంటే కాదు 95లో వెన్నుపోటుకు సహకరించిన మీడియాలో ఉన్నారు . పాతికేళ్ల తరువాత వెన్నుపోటు అని రాసినప్పుడు జగన్ మీడియాలో ఉన్నారు . నేను వెన్నుపోటు అని రాశాను అని స్వతంత్రంగా రాశాను అని కాలరెగిరిస్తే ఓ జర్నలిస్ట్ మిత్రుడు అది మీ పత్రిక పాలసీ కాబట్టి అలా రాయగలిగావు అంతే తప్ప అది మీ మీడియా ఇచ్చిన స్వేచ్ఛ కాదు అంటే ఆలోచిస్తే అతని వాదనలో కూడా నిజం ఉంది అనిపించింది . ఒక్కో సారి యజమాని జర్నలిస్ట్ ఒకే కోణం లో ఉంటే అదృష్టమే . బాబు వెన్నుపోటు సమయంలో మేనేజ్ మెంట్ , ఎడిటర్ , నేనూ వెన్నుపోటు అనే భావించడం వల్ల రాతలకు ఇబ్బంది కలుగలేదు . 2001 తెలంగాణ ఉద్యమం వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది . నేనేమో తెలంగాణ కోరుకున్న వాడిని , యాజమాన్యం కొన్ని కారణాల వల్ల మనం సమైక్యాంధ్ర అంది . ఎడిటర్ తెలంగాణ అనే మాట వినడానికే ఇష్టపడని వారు . ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎడిట్ పేజీలో వారం వారం రాసే పొలిటికల్ కాలం లో ధైర్యం చేసి తెలంగాణ ఎందుకు అవసరమో రాశాను . అది పబ్లిష్ అయ్యాక ఆఫీస్ లో తెలంగాణ మిత్రులు మెల్లగా ఏంటీ మన పత్రికలో తెలంగాణ గురించి అని మెల్లగా అభినందించి వెళ్లేవారు ... ముందుగా ఊహించినట్టుగానే ఎడిటర్ నుంచి ఫోన్ .. అక్షింతలు .. ఇంకోసారి నాకు చూపకుండా పంపవద్దు అని వార్నింగ్ .. నిజానికి నేను అంతకన్నా ఎక్కువ నష్టానికి మానసికంగా సిద్దమై ఉన్నాను . ఉద్యమం ఉదృతం అయ్యాక తెలంగాణ గురించి రాసుకొనే అవకాశం లభించింది . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం రాస్తే నేను తెలంగాణ కోసం రాశాను . పత్రికల్లో కొంత మేరకు యాజమాన్యం స్వేచ్ఛ ప్రసాదించినా , మాకు వద్దంటే వద్దు అని ఎడిటర్ , యజమాని ఏం కోరుకుంటే అదే రాద్దాం అనుకునేవాళ్లనూ చూశాను . 95లో వెన్నుపోటు గురించి రాసే అవకాశం భూమిలో ఉన్నా చాలా మంది ఉపయోగించుకోలేదు . అలానే తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక రాసే అవకాశం ఉన్నా స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు ఉన్నారు . ఎడిటర్ పేపర్ కు తానే ఓనర్ అన్నట్టు వ్యవహరించేవారు .. ఆంధ్రభూమి యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు . దీనివల్ల కొంత వరకు రాయాలన్నది రాసే అవకాశం లభించింది ... ***************** రాష్ట్ర విభజన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని విధంగా మీడియా రాజకీయ పార్టీలను మించి రాజకీయ అభిమానం చూపుతోంది . బాబు అరెస్ట్ తరువాత ఛానల్స్ లో కొందరు యాంకర్లు మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు . పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు సైతం యాంకర్ల పార్టీ భక్తి చూసి ఈర్ష పడేట్టుగా ఉంది . రెండు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉంది . కొన్ని మీడియాలను ఏకంగా పార్టీలే నడుపుతుంటే , కూని మీడియాలేమో పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి . సొంతంగా పార్టీలు నడిపే మీడియా పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది . పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా పార్టీ మారదనే నమ్మకం లేదు . మారుతూ ఉంటుంది . రాజకీయ పార్టీల్లో , మావోయిస్టుల్లో కోవర్ట్ లు ఉన్నట్టే మీడియాలో కూడా కోవర్ట్ లు ఉంటారు . ఒక పార్టీ మీడియాలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ కి సమాచారం చేరవేస్తారు . ఆ మధ్య ప్రభూత్వ ఉద్యోగులను ఓ మీడియా యజమాని బాబు ముందే తిడుతుంటే రికార్డ్ అయి బయటకు వచ్చింది ఇలానే . ఆ వీడియో టీడీపీకి కలిగించింది . *********** జాతీయ స్థాయిలో కొన్ని మీడియాలను బీజేపీ మరి కొన్నింటిని కాంగ్రెస్ బహిష్కరించింది . దానితో కాంగ్రెస్ సానుభూతి పరులు అంటూ ఎవరో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి చర్చ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు . రాహుల్ గాంధీ అదానీ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే , దానిని ప్రశ్నలతో రసాభాస చేయమని ndtv ఒక జర్నలిస్ట్ ను పంపితే , అతను నా వల్ల కాదు అని రాజీనామా చేశారు . మేనేజ్ మెంట్ చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగం లేదంటే బయటకు వెళ్ళాలి . సామాజిక మాధ్యమాల పుణ్యమా ? అని మీడియా లోని వ్యవహారాలు బయటకులు వస్తున్నాయి . ప్రతి మీడియాకు రాజకీయ అనుబంధం ఉంది .. కొందరు అనుబంధం కోసం పార్టీలకు దరఖాస్తు చేసుకున్నా వీరికి అంత సీన్ లేదు అని పార్టీలు పట్టించుకోవడం లేదు . గతం లో ఓ కొత్త మీడియా వస్తుందే అంటే ఎడిటర్ ఎవరు ? అనే ప్రశ్న వినిపించేది .. ఇప్పుడు ఓనర్ ఏ పార్టీ అనే ప్రశ్న వినిపిస్తుంది . - బుద్దా మురళి

11, అక్టోబర్ 2023, బుధవారం

ఎన్నికల ఖర్చు మాయాజాలం ఒక్కరూ పాటించరు .. ఒక్కరిదీ రుజువు కాదు..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -99

ఎన్నికల ఖర్చు మాయాజాలం ఒక్కరూ పాటించరు .. ఒక్కరిదీ రుజువు కాదు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -99 ------------------------------ 2009 - 10 కాలం లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయం వద్ద నిలబడి కడప జిల్లాకు చెందిన శాసన సభ్యులు లింగారెడ్డి నేనూ ఏదో మాట్లాడుకుంటుంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ శాసన సభ్యులు రాజు అని గుర్తు ఆవేశంగా సభ నుంచి వస్తూ ఇలాంటి వారున్న సభలో నేను శాసన సభ్యునిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఆవేశంగా ప్రకటించారు . ఏ మైంది అని పలకరిస్తే జగన్ వేల కోట్ల అవినీతి , అలాంటి అవినీతి పరుని గురించి సభలో చర్చ - విలువలు ఎక్కడికి పోతున్నాయి .. ఇలాంటి వారున్న సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను - సంక్షిప్తంగా ఇదీ అతని ఆవేదన . అతనికి నన్ను నేను పరిచయం చేసుకొని , మీ జేబులో ఉన్న ఒక్క రూపాయి గురించి కూడా అడిగే అధికారం నాకు లేదు . కానీ మనం విలువల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను . మీకు ఇష్టం అయితే చెప్పండి ఎన్నికల్లో మీరు ఎంత ఖర్చు చేశారు అని అడిగాను . అతను కాసేపు అలానే ఉండి పోయి , ఐతే అవినీతి గురించి ప్రశ్నించే హక్కు నాకు లేదా అని అడిగారు . అది కాదు ఎన్నికల్లో నిబంధనల మేరకే ఖర్చు చేసిన వారు ఎవరైనా ఉన్నారా ? అని నాకు పరిచయం అయిన అందరినీ అడుగుతున్నాను , తెలుసుకోవాలి అని ఆసక్తి అంతే అన్నాను . చెప్పు పరవాలేదు , మురళి మన ఫ్రెండే అని లింగా రెడ్డి తాను ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో చెప్పారు . ఎక్కువ ఖర్చు చేస్తే అవినీతిని ప్రశ్నించే హక్కు లేదా అని ఆ రాజుగారు మళ్ళీ అడిగారు . ఇలాంటి సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అన్నారు కదా ? నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఖర్చు చేసిన మీకు నైతికంగా అసలు సభలోకి వెళ్లే హక్కే లేదు . డబ్భు లేని వ్యక్తి సభ లోకి వెళ్లలేక పోయారు , డబ్బు ఎక్కువ ఖర్చు చేసి మీరు వెళ్లారు . మీ సభా ప్రవేశమే అనైతికం .. మీరే ఏ ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు అని చెప్పాను . విచిత్రం యేమిటంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు . ఇలా ఎక్కువ ఖర్చు చేశారు అని ఒక్కరంటే ఒక్కరి విషయంలోనూ రుజువుకాలేదు , రుజువు చేయలేరు . ఉమ్మడి రాష్ట్రంలో ఆసక్తితో దాదాపు 50-60 మందిని ఖర్చు గురించి అడిగి నిర్ధారించుకున్నాను . వార్త రాయడం కోసం కాదు ఆసక్తి కొద్ది తెలుసు కోవాలి అని అడుగుతున్నాను అంటే చాలా మంది చెప్పారు . తరువాత తెలంగాణ ఉద్యమం , అంతటా ఉద్రిక్త వాతావరణం వల్ల ఎన్నికల ఖర్చు గురించి మనసు విప్పి మేట్లడుకోలేదు . 294 మందిని ఖర్చు గురించి అడగలిగాని ఉండేది . 50-60 మందితోనే ఆగిపోయాను . ********* రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వార్త టివి లో చూస్తుంటే ... ఆ వెంటనే మరో ఆసక్తికరమైన వార్త .. ఖమ్మం జిల్లాలో లో ఓ వ్యక్తి డబ్బు తీసుకోని వెళుతుంటే తనిఖీ చేస్తున్న పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు . ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చినందున ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యం నుంచి కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారన్నమాట . ఎన్నికల కమిషన్ చాలా సేపు మీడియాతో మాట్లాడింది . అది పూర్తి కాక ముందే టివి ముందు నుంచి రంగంలోకి దిగిన పోలీసుల ఉత్సాహాన్ని చూశాక మన ప్రజాస్వామ్యం పోలీసుల వల్ల భద్రంగా ఉంది అనిపించింది . ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయవచ్చునో తెలుసా ? 2014 వరకు అయితే 28 లక్షలు , 2022 లో పెంచిన దాని ప్రకారం ఇప్పుడు 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు . జోక్ కాదు నిజం అందరూ ఇంతే ఖర్చు చేస్తారు , చేయాలి . ఇంతకన్నా ఎక్కువ ఖర్చు చేసినట్టు తేలితే శాసన సభ్యత్వం రద్దు అవుతుంది . దేశంలో ఏ ఒక్కరు కూడా ఈ పరిధికి లోబడే ఖర్చు చేయడం సాధ్యం కాదు . అలా అని పరిధికి మించి ఖర్చు చేశారు అని ఒక్కరి విషయంలోనూ రుజువు చేయడం సాధ్యం కాదు . ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి కూడా పరిమితిని మించి ఖర్చు చేశాడు అని రుజువు కాలేదు . .ఆ మధ్య యనమల రామకృష్ణులు ఓ టివి ఇంటర్వ్యూలో ఎన్నికల్లో తాను చేసిన భారీ ఖర్చు గురించి చెప్పారు . అది విని వైయస్ ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశారు . యనమల పని అయిపోయినట్టే ఇదిగో ఆధారం అని .. తరువాత ఏమైందో ఎవరూ పట్టించుకోలేదు . నామినేషన్ దాఖలు చేసే ఒక్క రోజే ఇంతకు మూడింతలు ఖర్చు అవుతుంది . ****** ఢిల్లీలో ఎన్నికల కమిషన్ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు రంగంలోకి దిగి దారులను దిగ్భందం చేసి వెతికితే నోట్ల కట్టలు దొరుకుతాయి . మీడియాలో బోలెడు ప్రచారం . బేగం బజార్ లో నిలబడి వాహనాలు వెతికితే రోజుకు కొన్ని కోట్లు దొరుకుతాయి . అలా డబ్బులు తీసుకువెళ్లే వారు ఎన్నికల్లో పంచడానికి కాదు . వారికి కనీసం ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అని కూడా తెలియదు . బేగం బజార్ లో రోజూ నగదు రూపంలోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది . ఒక్క బేగం బజార్ అనే కాదు ఇలా తనిఖీల్లో దొరికే డబ్బు కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సంబంధం ఉండదు . వ్యాపారాలు , వ్యక్తిగత అవసరాల కోసం అలా డబ్బు తీసుకువెళుతున్న వారే వారంతా .. ఇంకా వివిధ పార్టీల అభ్యర్థులే తేలనప్పుడు ఎవరు ఎవరికి పంచుతారు డబ్బులు . 2004 , 2009 ఎన్నికల్లో కొందరు ఏకంగా రెడీ మెడ్ సిమెంట్ మిక్సర్ భారీ వాహనాల్లో కూడా డబ్బు పంపినట్టు ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్న వారు ఎన్నికలు అయ్యాక చెప్పిన మాట . ఎన్నికల సంస్కరణలు అంటే చాలా మంది శేషన్ పేరు గుర్తు చేసుకుంటారు . ఒకరు మరో కోణంలో చూశారు . శేషన్ కన్నా ముందు గోడల మీద రాతలతో తక్కువ ఖర్చుతో ప్రచారం జరిగేది . శేషన్ పుణ్యమా అని గోడమీద రాతలు మాయం ఆయాయ్యి కానీ ఖర్చు భారీగా పెరిగింది . ఎన్నికల ఖర్చు రాసి , ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి . ఎన్నికల ఖర్చు పరిమితిలో సగం ఈ ఆడిటర్ పీజుకే కేసరిపోతుందేమో .. - బుద్దా మురళి

5, అక్టోబర్ 2023, గురువారం

ఆ నేత మరణం తీరని లోటు ... జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది .. ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 98

ఆ నేత మరణం తీరని లోటు ... జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 98 ---------------------------------------- ఎవరైనా రాజకీయ నాయకుడు మరణిస్తే .. ఆ వార్తలు చదివితే పత్రిక ఏదైనా కావచ్చు , నాయకుడు ఎవరైనా కావచ్చు , ప్రకటన ఇచ్చింది ఎవరైనా కావచ్చు ఒక వాఖ్యం అన్నింటిలో కామన్ గా కనిపిస్తుంది . ఆ నాయకుడి మరణం తీరని లోటు అనే మాట లేకుండా వార్త ఉండదు . అలానే జర్నలిస్ట్ మరణిస్తే సిటీ పేజీలో , జిల్లాల్లో ఐతే జిల్లా పేజీలో తప్పని సరిగా కనిపించే మాట . మరణించిన కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది . ఆ మాట చదవగానే వైరాగ్యంతో కూడిన నవ్వు వస్తుంది . ******** 1993 నాటి మాట .. 30 ఏళ్ళ క్రితం నల్లగొండ జిల్లా లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా చేస్తున్నప్పుడు మిర్యాలగూడలో యూనియన్ సమావేశం . హైదరాబాద్ నుంచి యూనియన్ రాష్ట్ర నాయకులు రావాలి . ఆలస్యం అవుతోంది . వారు వచ్చే వరకు మౌనంగా ఉండలేరు కదా ? అప్పటి వరకు జిల్లా స్టాప్ రిపోర్టర్ లు మాట్లాడితే బాగుంటుంది అని సలహా ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతున్నారు . నన్నూ మాట్లాడమన్నారు. అప్పటివరకు మాట్లాడిన అనుభవం లేదు . నాలుగు మంచి మాటలు చెప్పేందుకు ఇబ్బంది ఏముంది అని మైకు తీసుకోని .... మీరు ఫుల్ టైం పని చేయాల్సిన స్టాఫ్ రిపోర్టర్ లు కాదు , పార్ట్ టైం పని చేయాల్సిన లోకల్ విలేకరులు . మా ఏరియానే ప్రపంచం , ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అనే భావన వద్దు . మేనేజ్ మెంట్ కు కోపం వచ్చినా , ఎవరికి కోపం వచ్చినా మీ పార్ట్ టైం ఉద్యోగానికి భరోసా ఉండదు . పైగా మీకు వచ్చే డబ్బు అంతంత మాత్రమే . ఇది పార్ట్ టైం అని గుర్తుంచుకొని , ఏదైనా ఉపాధి మార్గం చూసుకోవాలి . ఒకరికి చేయి చాపే స్థితిలో ఉండకూడదు . ఆ నాయకుడు తెలుసు , ఈ నాయకుడు తెలుసు అని చెప్పుకోవడానికి బాగుంటుంది , అవేవి జీవితానికి ఉపయోగపడవు . నీ జీవితం నీకు ముఖ్యం . అందరూ నమస్తే అన్నా అంటున్నారని మురిసిపోవడం కాదు . జీవితానికి ఉపయోగపడే ఉపాధి చూసుకొని , పార్ట్ టైం విలేఖరులుగా ఏదో ఆసక్తి ఉంటే పని చేయండి. చాలా మంది మరణిస్తే అంత్యక్రియలకు చందాలు వసూలు చేయడం చూశాను . ఉపాధి చూసుకోవడం , ఉపాధి పొందే నైపుణ్యం పెంచుకోవడం ముఖ్యం అంటూ ఉపన్యాసం ఇస్తున్నాను ... నేను అలా మాట్లాడుతుండగానే రాష్ట్ర నాయకులు వచ్చారు . నా ఉపన్యాసంలో కొంత విన్నారు . ఎంత విన్నా ఏదో ఒక ఉపాధి చూసుకోండి అనే మాటనే తిప్పి తిప్పి చెప్పాను .. రాష్ట్ర నాయకులు వస్తూనే ఇది జర్నలిస్ట్ ల యూనియన్ మీటింగ్ హక్కుల కోసం పోరాటాల గురించి ఉపన్యాసాలు ఉండాలి , ఉపాధి గురించి కాదు అని నాకు ఓ చురక అంటించారు.. ఆ తరువాత జర్నలిస్ట్ అంటే ఏమిటీ ? యూనియన్ ఏమిటీ ? ఉద్యమాలు , త్యాగాలు అంటూ యూనియన్ నాయకులు బాగా మాట్లాడారు . నాకూ నిజమే అనిపించింది . ఆ సమావేశం చివరలో విరాళాలు వసూలు చేశారు . స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ ఒకరు మరణించారు . అంత్యక్రియలు , తక్షణం కుటుంబం గడవడానికి ఏమీ లేదు . దానితో విరాళాలు వసూలు చేశారు .అప్పుడు యూనియన్ నాయకుడి ఉపన్యాసం నాకూ బాగానే నచ్చింది కానీ .. జర్నలిజం అంటే , యూనియన్ అంటే ఏమిటో అద్భుతంగా మాట్లాడిన ఆ యూనియన్ నాయకుడికి చాలానే సైడ్ బిజినెస్ లు ఉన్నాయని ఒకటి రెండు దశాబ్దాల తరువాత కానీ నాకు తెలియలేదు . ************** మూడు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు అంత అమాయకులేం లేరు . చాలా మంది స్థానిక విలేకరులు కూడా ముదిరిపోయారు . అలానే చాలా మంది ఊబిలో చిక్కుకు పోయినట్టు అక్కడే ఉండిపోతున్నారు . అక్కడ ఉండలేరు , బయటకు రాలేరు . ఒక్క సారి ఆ గౌరవానికి , నాయకుల నుంచి అన్నా అనే పిలుపునకు అలవాటు పడి అక్కడే కొట్టుమిట్టాడే వారు ఉన్నారు . ఒక ఉద్యోగం లా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్న వారూ ఉంటే ఉండొచ్చు ... ************** ********* 1995-96 లో ఓ రోజు సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వస్తూ ట్యాంక్ బండ్ పై కాసేపు ఆగాను . బైక్ మీద ప్రెస్ అని చూసి ఓ పెద్దాయన వచ్చి ఏ పేపర్ అని అడిగారు . ఆంధ్రభూమి అని చెబితే సీరియస్ గా మీ జర్నలిస్ట్ లను అస్సలు నమ్మొద్దు అని ఏదో గొణిగాడు . ఏమైంది అంటే ఆంధ్రభూమిలో బాబురావు అని జర్నలిస్ట్ ఉండేవారు . అయన మరణించినప్పుడు ఆంధ్రభూమి జర్నలిస్ట్ లు చాలా మంది ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారట ... తరువాత ఎవరూ పట్టించుకోలేదు . ఇదీ ఆయన కోపానికి కారణం .. ఎవడి బతుకు వాడికే కష్టం .. ఇంకా ఇతరుల కుటుంబాలను పట్టించుకునేంత , అండగా ఉండే అంత ఉంటుందా ? ఏదో మాట వరుసకు అలా అంటారు . ****************** నగరంలో లోకల్ విలేకరి ఒకరు మరణించిన వార్తలో .. ఆ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అనే వార్త చదివాక మిర్యాలగూడ మీటింగ్ , ట్యాంక్ బండ్ సంఘటన గుర్తుకు వచ్చింది. ఎప్పటిలానే మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అని ప్రకటించారు . ఎవరికి ఎవరు అండగా ఉండలేరు . ఎవరి బతుకు వారికే సమస్య కనీసం ఇప్పుడు మీడియా అకాడెమీ ఆర్ధిక సహాయం చేస్తోంది . గతంలో అదికూడా లేదు . ***** నాయకుడు మరణించినా , సినిమా వాళ్ళు మరణించినా వారి మరణం తీరని లోటు అనేది కామన్ డైలాగు . ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ సీఎం ఒకరు మరణిస్తే ఆఫీస్ లో ఉండగా ఫోన్ రింగ్ అయింది . వి . హనుమంతరావు ఫోన్ చేసి కాంగ్రెస్ రిపోర్టర్ గురించి అడిగితే ఇంకా రాలేదు అని చెబితే సంతాపంలో నాదీ రాసేసుకో .. తెలుసు కదా తీరని లోటు అని రాయి అని ఒక్క ముక్కలో ముగించేశారు . ************** ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబానికే తీరని లోటు .. ఆ సంగతి జర్నలిస్ట్ మిత్రులు బతికి ఉండగా గ్రహించాలి అని ఆశ ... - బుద్దా మురళి